మిస్ యూనివర్స్ హర్నాజ్పై చీటింగ్ కేసు.. నష్టపరిహారానికి డిమాండ్
సుస్మితాసేన్, లారాదత్తాల తర్వాత మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్శించిన అందాల తార హర్నాజ్ కౌర్ సింధుపై చీటింగ్ కేసు నమోదైంది. తనను చీట్ చేసిందంటూ పంజాబీ సినీ నిర్మాత ఉపాసన సింగ్ చండీగఢ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆమె వల్ల తాను ఆర్ధికంగా నష్టపోయాననీ, నష్టపరిహారం ఇప్పించాలని పిటిషన్లో పేర్కొంది. విచారించిన కోర్టు.. స్పందన తెలియజేయాలని హర్నాజ్కు నోటీసులు పంపింది.
అంతకుముందు ఏం జరిగిందంటే.. మిస్ యూనివర్స్ కాకముందు హర్నాజ్ మోడలింగ్ చేస్తూ పలు పంజాబీ సినిమాలు చేసింది. ఈ క్రమంలో ఉపాసన సింగ్తో 2020లో భాయ్ జీ కుట్టంగే అనే సినిమాకు సంతకం చేసింది. ఒప్పందం ప్రకారం హర్నాజ్.. షూటింగ్ ప్రారంభం నుంచి విడుదలయ్యేంతవరకు ఎప్పుడు పిలిచినా రావాలని, అన్ని ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనాలని రాసుకున్నారు. అయితే మిస్ యూనివర్స్ టైటిల్ గెలిచిన తర్వాత హర్నాజ్ వారిని పూర్తిగా అవాయిడ్ చేసింది. ఎవరు ఫోన్ చేసినా కాల్స్ లిఫ్ట్ చేయడం లేదు. దీంతో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన హర్నాజ్ తీరు వల్ల తమకు నష్టం జరిగిందని నిర్మాతలు కోర్టుకెక్కారు. కాగా, ఈ కేసుపై హర్నాజ్ ఇంతవరకూ స్పందించకపోవడం గమనార్హం.