టీం ఇండియా ఆటగాళ్లపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. భారత్ ఆటగాళ్లు ఫిట్ నెస్ కోసం ఇంజెక్షన్లు తీసుకుంటార్న విషయంతో పాటు, రోహిత్-కోహ్లీ సంబంధాలు, బుమ్రా గాయం, కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ దూరం కావడం వంటి అంశాలపై చేతన్ శర్మ ఆఫ్ ద కెమెరా మాట్లాడిన మాటలను జీ న్యూస్ స్పై కెమెరాలతో రికార్డు చేసి బయట పెట్టడం సంచలనం సృష్టిస్తోంది. ఈ స్ట్రింగ్ ఆపరేషన్లో చేతన్ శర్మ బహిర్గతం చేసిన అంశాలు క్రికెట్ అభిమానులు విస్తుగొలిపేలా ఉన్నాయి.అసలు చేతన్ శర్మ ఏంమాట్లాడాడో ఒకసారి చూద్దాం.
ఫిట్నెస్ కోసం ఇంజెక్షన్లు
భారత ఆటగాళ్ల ఫిట్నెస్పై చేతన్ శర్మ వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. 100 శాతం ఫిట్గా ఉండేందుకు ఇంజెక్షన్లు తీసుకుంటారని చేతన్ శర్మ చెప్పాడు. డోప్ టెస్టుల్లో పట్టుబడని ఉత్ప్రేరకం ఉన్న మందులను వాడతారంటూ అతడు చేసిన వ్యాఖ్యలు భారత్ క్రికెట్ను కుదిపేస్తున్నాయి. బుమ్రా గాయం నుంచి కోలుకోకముందే ఈ మందులను ఉపయోగించి మ్యాచ్లోకి దించారని చేతన్ బాంబ్ పేల్చాడు. ఫామ్లో లేని పలువురు ఆటగాళ్లు ఈ ఇంజెక్షన్లపై ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పడం చర్చనీయాంశమవుతోంది.
రోహిత్ టీ20 కెరీర్ ముగిసింది
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తనను గుడ్డిగా నమ్ముతారని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ అన్నాడు. ఆ ఇద్దరూ మా ఇంటికి వచ్చారు. హార్దిక్ పాండ్యా తరచుగా నన్ను కలుస్తాడు అని వెల్లడించాడు. ఇక రోహిత్ శర్మ టీ20 కెరీర్ ముగిసిందని తెలిపాడు.” శుభ్మన్ గిల్కు అవకాశం ఇవ్వడం కోసం కోహ్లీ, రోహిత్ లాంటి పెద్ద స్టార్లకు టీ20 ఫార్మాట్ నుంచి విశ్రాంతినిచ్చాం. భవిష్యత్తులో రోహిత్ శర్మ టీ20 క్రికెట్ ప్రణాళికల్లో ఉండడు. హార్దిక్ పాండ్యానే దీర్ఘ కాలం కెప్టెన్గా కొనసాగుతాడు” అని చేతన్ శర్మ పేర్కొన్నాడు.
రోహిత్ vs కోహ్లీ
రోహిత్, కోహ్లీ మధ్య గొడవలపై కూడా చేతన్ శర్మ నోరుజారేశాడు. భారత జట్టులో రెండు వర్గాలు ఉన్నాయని. ఓ వర్గాన్ని రోహిత్ శర్మ నడిపిస్తే, మరొకటి విరాట్ కోహ్లీ నేతృత్వంలో నడుస్తుందని బహిర్గం చేయడం దుమారం రేపుతోంది. అయితే “కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. కోహ్లీ ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడ్డపుడు రోహిత్ శర్మ అండగా నిలిచాడు. రోహిత్, కోహ్లీ మధ్య అహం సమస్యగా మారింది” అని వెల్లడించాడు.
కోహ్లీ కెప్టెన్సీపై..
” గంగూలీ, కోహ్లీకి మధ్య సత్ససంబంధాలు లేవు. అయితే కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలన్ని గంగూలీ నిర్ణయం కాదు. ఉమ్మడి తీసుకున్నది. పరిమిత ఓవర్ల క్రికెట్లో జట్టుకు ఒకే కెప్టెన్ ఉండాలని అనుకుంటున్నట్లు విరాట్కు ముందే చెప్పాం. తొలుత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పుడు మరోసారి అలోచించుకోవాలని గంగూలీ సూచించాడు. అయితే తర్వాత మీడియా సమావేశంలో కోహ్లీ..గంగూలీని నిందించాడు. వన్డే కెప్టెన్సీ నుంచి తనును తప్పించడానికి .గంగూలీయే కారణమని కోహ్లీ భావించాడు” అని చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమవుతున్నాయి. రవిశాస్త్రి కోచ్ అవ్వడంలో కోహ్లీ కీలక పాత్ర వహించడాని చేతన్ తెలిపాడు.
వారి భవిష్యత్తు ప్రమాదంలో
సూర్యకుమార్, ఇషాన్కిషన్, దీపక్ హుడా, శుభ్మన్ గిల్.. ఇలాంటి 15-20 మంది యువ ఆటగాళ్లను జట్టులోకి తానే తెచ్చినట్లు చేతన్ శర్మ తెలిపాడు. ఇషాన్ కిషన్, శుభ్మన్ల చక్కటి ఫామ్ సంజు శాంసన్, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ల భవితవ్యాన్ని ప్రమాదంలో పడేసిందని పేర్కొన్నాడు.
బీసీసీఐ చర్యలు ?
అనవరంగా నోరుజారి వివాదాలు కొనితెచ్చుకున్న చేతన్ శర్మపై బీసీసీఐ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతని వ్యాఖ్యలను పరిశీలించినట్టు వార్తలు వస్తున్నాయి.
బోర్డు పెద్దలు మౌనం వహిస్తున్నప్పటికీ.. చేతన్పై వేటు వేయడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా జై షా.. చేతన్ శర్మ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. గతేడాది టీ20 ప్రపంచకప్లో టీమిండియా వైఫల్యం నేపథ్యంలో కమిటీలోని మిగతా సభ్యులందరినీ తప్పించి, ఛైర్మన్ అయిన చేతన్ను మాత్రం బీసీసీఐ కొనసాగించింది.