విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే క్రమశిక్షణ తప్పుతున్నారు. గత కొంతకాలంగా స్కూళ్లలో ఉపాధ్యాయులు అసభ్య ప్రవర్తనలు, విద్యార్థులపై లైంగిక దాడుల గురించి వార్తలు విన్నాం.. ఇందుకు భిన్నగా ఒక మహిళా ఉపాధ్యాయురాలు మద్యం సేవించి స్కూల్కు వచ్చింది. స్కూల్ తనిఖీకి వచ్చిన విద్యాశాఖ అధికారి ఆమెను ఆ స్థితిలో చూసి షాకయ్యారు. ఛత్తీస్గఢ్లోని జష్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాయ్పూర్కు 430కిమీ దూరంలోని జష్పూర్ జిల్లా హెడ్క్వార్టర్స్ శివార్లలోని టికైత్గంజ్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న జగపతి భగత్ అనే ఉపాధ్యాయురాలు తాగి విధులకు హాజరైంది.
అదే రోజున ఆ బ్లాక్ విద్యాశాఖ అధికారి సిద్ధిక్.. రోటీన్ తనిఖీలో భాగంగా ఆ స్కూల్కు వెళ్లారు. 3, 4 తరగతలను బోధించే లేడీ టీచర్ జగపతి భగత్ నేలపై పడుకుని ఉండటం చూసి షాకయ్యారు. ఆమెకు ఆరోగ్యం బాగోలేదేమోనని తొలుత అనుకున్నారు. క్లాస్లో ఆడుకుంటున్న విద్యార్థులను అడగ్గా, టీచర్ తాగి వచ్చిందని చెప్పారు. గత కొన్ని రోజులుగా ఆమె మద్యం సేవించి స్కూల్కు రావడంపై పలు ఫిర్యాదులు కూడా వచ్చాయి. సదరు మహిళా ఉపాధ్యాయురాలిని విధుల నుంచి తొలగిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు జూన్ 16న ప్రారంభమైన ఈ విద్యా సంవత్సరంలో జష్పూర్ జిల్లాలో ఇప్పటి వరకు ఐదుగురు ఉపాధ్యాయులు సస్పెండ్ అయ్యారు. అందులో ముగ్గురు టీచర్లు మద్యం తాగి స్కూల్కు రావడం వల్లే సస్పెండ్ అవడం గమనార్హం.