తెలంగాణ గవర్నర్ తమిళిసై ఢిల్లీ వేదికగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ మధ్య తన మధ్య కోల్డ్వార్ కొనసాగుతుందని అన్నారు. నేడు భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం స్వీకారం జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుంచి గవర్నర్ తమిళిసై హాజరయ్యారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ”తెలంగాణలో వరదలపై టీఆర్ఎస్ రాజకీయం చేయడం మంచిది కాదు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెలంగాణకు వచ్చాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ నిధులకు సంబంధించిన వివరాలు ఇచ్చారు. నేను ఎప్పుడూ ప్రజలతోనే ఉంటాను. నైతిక బాధ్యతతోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాను. వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదించాను. కింది స్థాయి నుంచి వచ్చిన మహిళ..ఈరోజు దేశానికి రాష్ట్రపతి కావడం ఒక్క భారత్లోనే సాధ్యం. మహిళా రాష్ట్రపతి కింద మహిళా గవర్నర్గా పని చేయడం నాకెంతో సంతోషంగా ఉంది. ఇతర రాష్ట్రాల గవర్నర్లతో నేను పోల్చుకోను. గవర్నర్ను కాబట్టి రాజ్భవన్కే పరిమితం కాను. ప్రజలకు అందుబాటులో ఉండటమే నా లక్ష్యం. నాకు తోచిన రీతిలో వారికి సాయం అందిస్తాను” అని ఆమె అన్నారు.
ఇక, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశమే లేదని ఆమె స్పష్టం చేశారు. రాజ్భవన్లో కేసీఆర్ కలిసిన తర్వాత కూడా ప్రొటోకాల్లో ఏమాత్రం మార్పు లేదని, వరదల సమయంలో కలెక్టర్ కూడా రాలేదని, మా మధ్య సంబంధాల్లో ‘స్టేటస్ కో’నే ఉందని ఆమె పేర్కొన్నారు.