హోరాహోరీ పోరు సాగుతున్న మునుగోడు నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. నియోజక వర్గంలోని చండూరులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయంలో ప్రచారసామాగ్రి దగ్దం కావడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు ఉదయం చండూరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయంలో మంటలు వ్యాపించాయి. ఎన్నికల ప్రచార సామాగ్రిని దుండగులు దగ్దం చేశారని కాంగ్రెస్ పార్టీ నేతలు అనుమానిస్తున్నారు.ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీలు బీజేపీ, టీఆర్ఎస్ సంయుక్తంగా వ్యూహాలు రచిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచారానికి అడుగడునా ఇబ్బందులు సృష్టిస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో మంటలు ఆ రెండు పార్టీలకు చెందినవారు చేసిన పనేనని, 24గంటల్లో నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నల్గొండ ఎస్పీ కార్యాలయం ముందు తానే ధర్నా చేస్తానని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ఈ ఘటనలో ఆఫీసులోని కండువాలు, పోస్టర్లు, బ్యానర్లతో పాటు ఇతర సామాగ్రి కాలి బూడిదైందని రేవంత్ రెడ్డి వివరించారు.
మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ప్రత్యర్థులు దుష్ట చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడిగా చండూరులో తన పర్యటన నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి చండూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టి ధ్వంసం చేయడం దారుణమన్నారు. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ దిమ్మెలు కూల్చినా, పార్టీ కార్యాలయాలు తగులబెట్టినా, మునుగోడు గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని రేవంత్ స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక నేతలు కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారని రేవంత్ వివరించారు. సత్వర విచారణ జరిపి నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.