భారత్లో కరోనా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే 60 లక్షలకు పైగా బాధితులుగా మారారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 82,170 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. 1039 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. 7,09,394 శాంపిళ్లను పరీక్షించగా ఈ స్థాయిలో కేసులు వచ్చాయి. నిన్న ఒక్కరోజే 92,000 మంది బాధితులు కోలుకున్నారు. రికవరీ రేటు 82 శాతానికి చేరింది. రోజువారీ కేసుల్లో మొదటిస్థానంలో ఉన్న భారత్, రికవరీ రేటులోనూ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచింది.
దేశవ్యాప్తంగా 60,74,703 మందికి ఈ వ్యాధి సోకింది. 95,542 మంది మృత్యువాతపడ్డారు. 50,16,521 మంది వైరస్ను జయించగా.. 9,62,640 మంది ఇంకా చికిత్స తీసుకుంటూనే ఉన్నారు. వారిలో అత్యధికంగా హోం క్వారంటైన్లోనే ఉంటున్నారు. నిన్నటి వరకు మొత్తం 7,19,67,230 కరోనా పరీక్షలు నిర్వహించారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా 33,307,178 మందికి వైరస్ సోకింది. 1,002,399 బాధితులు చనిపోయారు. 24,638,184 రికవరీలు ఉండగా.. 76,66,595 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, వైరస్ వ్యాప్తిలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో ఉంది. భారత్ విషయానికి వస్తే.. మహారాష్ట్ర మొదటి స్థానం, ఏపీ రెండో స్థానంలో కొనసాగుతున్నాయి.