కరోనా వైరస్ కారణంగా క్రికెట్ షెడ్యూలులో కొన్ని మార్పులుంటాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. కరోనాతో ప్రపంచమంతా ఒక్కసారిగా షాక్కు గురైందని గంగూలీ అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ వచ్చాక పరిస్థితి సాధారణంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ‘ప్రపంచం కరోనా నుంచి తేరుకుని పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయి. ఇప్పటికైతే ఔషధాలు లేకున్నా.. ఆరు, ఏడు నెలల్లో వ్యాక్సిన్ వస్తే అంతా సర్దుకుంటుంది. మనలో ప్రతిఘటించే శక్తి చాలా ఉంది. క్రికెట్ సాధారణ స్థితికి వస్తుందని భావిస్తున్నా. బీసీసీఐ, ఐసీసీ కలిసి క్రికెట్ను సాధారణ స్థితికి తీసుకొస్తాయి. ఈ క్రీడ అత్యంత శక్తిమంతమైంది. ఆటగాళ్లకు కొన్ని పరీక్షలు ఉండొచ్చు. వ్యాక్సిన్ వస్తే అంతా సాధారణ స్థితికి వస్తుంది’ అని దాదా అన్నారు.
ఒకప్పుడు ఫుట్బాలే తన జీవితమని.. అనుకోకుండా క్రికెటర్గా మారానని గంగూలీ అన్నారు. వేసవిలో ఇంట్లో పనేం ఏమీ చేయడం లేదని తన తండ్రి క్రికెట్ అకాడమీకి వెళ్లమన్నారని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. ‘ఇంట్లో సోదరులు, సోదరీమణులు, పెద్దవారు ఎక్కువ క్రమశిక్షణగా ఉండటంతో వారికి దూరంగా ఉండొచ్చు కాబట్టి అకాడమీ బాగా నచ్చింది. వయసు ఆధారిత ఆటలో ఒడిశాపై శతకం చేశాను. జట్టులో చాలామంది అనారోగ్యం బారిన పడటంతో అనుకోకుండా అవకాశం వచ్చింది. లార్డ్స్లో శతకం చేయడం నాకో మరుపురాని అనుభూతి’ అని దాదా తెలిపారు.