స్కూలుకు రూ. 618 కోట్ల కరెంటు బిల్లు..
కరెంట్ బిల్లులు కరెంటును మించిన షాకులు ఇస్తున్నాయి. వేలల్లో, లక్షల్లో వస్తున్న బిల్లులను చూసి వినియోగదారులు బిత్తరపోతున్నారు. ఇదేంటని అడిగితే అధికారులు ఏవో కారణాలు చెబుతున్నారు. అయితే ఓచోట మాత్రం కళ్లు బైర్లు కమ్మేలా కరెంట్ బిల్లు వచ్చింది. వేలు, లక్షల్లో కాకుండా కోట్లలో బిల్లు వచ్చింది. ఏకంగా రూ.618 కోట్ల బిల్లు వచ్చింది. ఈ బిల్లు వచ్చింది దేశంలో మరెక్కడో కాదు.. ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసిలో. వారణాసిలోని వినాయక్ కాలనీలో ఉన్న ఓ పాఠశాలకు ఇన్నేసి కోట్ల బిల్లు వచ్చింది. బిల్లును చూసి పాఠశాల యాజమాన్యం షాక్కు గురై తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. స్కూలు, చుట్టుపక్కల స్థలాలు అమ్మినా అన్ని కోట్లు రావు.. అలాంటిది ఇన్నేసి కోట్ల బిల్లు ఎలా చెల్లించాలని ఆగమాగం అవుతున్నారు.
దీనిపై విద్యుత్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని స్కూలు సిబ్బంది వాపోయారు. ఈ బిల్లు వెనుక మరొక ట్విస్ట్ ఏంటంటే.. ఈ నెల 7వ తేదీలోపు బిల్లు చెల్లించకపోతే కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని హెచ్చరించారు. దీంతో వారికి ఏం చేయాలో, తమ గోడు ఎవరిముందు చెప్పుకోవాలోనని తెగ హైరానా చెందుతున్నారు స్కూలు యాజమాన్యం. దీనిపై ఉన్నతాధికారులను వివరణ కోరగా, సాఫ్ట్వేర్ సమస్య కారణంగానే బిల్లింగ్లో పొరపాటు జరిగిందని తెలిపారు. ఆ స్కూలుకు ఇలాంటి షాకింగ్ బిల్లులు రావడం ఇదే ప్రథమం కాదు. గతంలోనూ ఈ రీతిలో బిల్లులు వారిని బెంబేలెత్తించాయి.