ఇటీవల కాలంలో సైబర్ నేరాలు మరింత పెరిగిపోతున్నాయి. చాలా మంది సైబర్ కేటుగాళ్ల వలలో పడి దారుణంగా మోసపోతున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా వీరి ఉచ్చులో చిక్కుకుంటున్నారు. తాజాగా సినియర్ హీరోయిన్ నగ్మా కూడా కేటుగాళ్ల వలలో పడి మోసపోయారు. తన మొబైల్కు వచ్చిన మెసేజ్ని క్లిక్ చేసి రూ. లక్ష పోగొట్టుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే… ఫిబ్రవరి 28వ తేదీన నగ్మా ఫోన్ కి బ్యాంక్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. కేవైసీకి సంబంధించిన లింక్ కావడంతో ఆమె వెంటనే దానిని క్లిక్ చేశారు. లింక్ ఓపెన్ చేయగానే… ఆమెకు బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చిందట. ఫోన్ చేసిన వ్యక్తి తనను తాను బ్యాంక్ ఎంప్లాయిగా పరిచయం చేసుకున్నాడు. కేవైసీ అప్ డేట్ చేయమని చెప్పారు. ఆమె తన బ్యాంక్ వివరాలు చెప్పనప్పటికీ… బెనిఫిషియరీ అకౌంట్ క్రియేట్ చేసుకొని దాదాపు రూ.లక్ష ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. తన డబ్బులు పోయినందుకు ఆమె చాలా బాధ వ్యక్తం చేశారు.
నేరగాడు లాగిన్ అయ్యే క్రమంలో తన మొబైల్కి దాదాపు 20 సార్లు ఓటీపీలు వచ్చాయని నగ్మా వెల్లడించారు. పెద్ద అమౌంట్ కాకుండా కేవలం లక్ష రూపాయలతో ఈ ఫ్రాడ్ నుండి బయటపడినందుకు నగ్మా బాధలో సంతోషం వ్యక్తం చేశారు. నగ్మా మాదిరే సదరు బ్యాంకులో ఖాతాలు ఉన్న మరో 80 మంది కూడా ఇదే తరహాలో మోసపోవడం గమనార్హం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ముంబై సైబర్ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.