అనూహ్యం.. కాంగ్రెస్ పార్టీకి దాసోజు శ్రవణ్ రాజీనామా
కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహారంతో ఇప్పటికే సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి అనూహ్యంగా మరో షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన శ్రవణ్.. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇటీవల పీజేఆర్ కూతురు విజయారెడ్డి కాంగ్రెస్లో చేరడంతో అప్పటి నుంచి శ్రవణ్ అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాజీనామా ప్రకటించారు. మరోవైపు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు వెంకట్ రెడ్డి నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలువనున్నారు. పార్టీ మారింది రాజగోపాల్ రెడ్డి అయితే ఆయన వెంట వెంకట రెడ్డి కూడా ఉండడం గమనార్హం. మధ్యాహ్నం రెండున్నర గంటలకు అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వగా, భేటీ తర్వాత వెంకట రెడ్డి నుంచి కీలక ప్రకటన రావొచ్చని అంచనా వేస్తున్నారు. కాగా, వరుసగా జరుగుతున్న పరిణామాలతో తెలంగాణలో ఎన్నికల వాతావరణం మొదలైందని విశ్లేషకులు భావిస్తున్నారు.