ప్రమాదంలో ఉన్న ఇతరులకు సాయం చేయబోయి తన ప్రాణాలే పోగొట్టుకున్నాడో వ్యక్తి. అతని మరణంతో కొడుకు, కూతురు ఆనాథలయ్యారు. అసలే పేదరికం.. చివరకు కన్నతండ్రి అంత్యక్రియలకు డబ్బులు కూడా లేకపోవడంతో భిక్షాటనకు సిద్ధమైంది అతని కూతురు. ప్రతీ గడపకు వెళ్లి భిక్షాటన చేసి తండ్రి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ హృదయ విషాదకర సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామస్తుల కథనం ప్రకారం ఆదివారం గ్రామంలోని వివేకానంద విగ్రహం వద్ద కొందరికి నాగుపాము కనిపించింది. దీంతో వారు గ్రామానికి చెందిన ఒంటెద్దు దుర్గయ్యకు సమాచారం చేరవేశారు. దుర్గయ్య పామును పట్టుకొని సంచిలో వేసే క్రమంలో అతనిపై పాము కాటు వేసింది. అపస్మారక స్థితిలో వెళ్లడంతో వెంటనే గ్రామస్తులు అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. కానీ అప్పటికే దుర్గయ్య మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దుర్గయ్య కూలి పనులు చేసుకుంటూ ఎక్కడైనా పాములు కనబడితే పాములను పట్టే వృత్తి నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో దుర్గయ్య అంత్యక్రియలు నిర్వహించడానికి డబ్బులు లేకపోవడంతో కన్న కూతురు బుజ్జి, కొడుకు కాశీరాం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా తిరుగుతూ బిక్షాటన చేసి డబ్బులు పోగు చేసి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ హృదయ విదారక ఘటన అందరికీ కలచివేస్తుంది.