దావూద్ ఇబ్రహీం గురించి అందరికి తెలుసు కదా. ముంబైలో జరిగిన పేలుళ్లలో ప్రధాన సూత్రదారి,అండర్ వరల్డ్ డాన్. దావూద్ కూడబెట్టిన ఆస్తుల వివరాలు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే. ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న క్రిమినల్ గా రికార్డ్ కొట్టేశిండు దావుద్ ఇబ్రహీం. ఆయన ఆస్తులు దాదాపు రూ 43 వేల కోట్లు ఉంటాయని బ్రిటన్ కు చెందిన మిర్రర్ అనే పత్రిక వెల్లడించింది. ఇక మొదటి సంపన్న క్రిమినల్ గా కొలంబియాకు చెందిన డ్రగ్ వ్యాపారి పాబ్లో ఎస్కోబార్ ఉన్నడు. దావూద్ పేరుమీద చాలా విలాసవంతమైన ప్రాపర్టీలు ఉన్నాయి. ప్రస్తుతం దావూద్ పాకిస్థాన్లో తలదాచుకున్నాడు. అయితే వేరు వేరు పేర్ల మీద ఉన్న దావూద్ ఆస్తుల చిట్టాను తాజాగా బ్రిటన్ బయటపెట్టింది.
దావూద్ ఆస్తులను జప్తు చేసే ప్రక్రియను కూడా బ్రిటన్ మొదలుపెట్టింది. దావూద్ పేరు మీద వార్విక్ షైర్లో ఓ ఖరీదైన హోటల్ ఉంది. మిడ్ల్యాండ్స్లోనూ అనేక రెసిడెన్స్ ప్రాపర్టీలు ఉన్నాయి. ముంబై పోలీస్ కుటుంబంలో పుట్టిన దావూద్ అక్కడే ‘డీ’ కంపెనీ పేరుతో పెద్ద గ్యాంగ్స్టర్ వ్యవస్థను నడిపాడు. ప్రస్తుతం దావూద్ తలపై రూ.160 కోట్ల నజరానా ఉంది. దావూద్కు చెందిన డీ కంపెనీ మొత్తం 16 దేశాల్లో విస్తరించి ఉంది. మిడ్ల్యాండ్స్లో ఉన్న దావూద్ రెసిడెన్స్ ప్రాపర్టీలపై ప్రస్తుతం బ్రిటన్ ప్రభుత్వం నిఘా పెట్టింది. భారత్కు చెందిన ఈడీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బ్రిటన్ ఈ అడుగులు వేసినట్లు తెలుస్తున్నది. అయినా క్రిమినల్స్ అని ముద్ర పడ్డంక ఎన్ని వేల కోట్లు సంపాదిస్తె ఏం లాభం. ఎవడెప్పుడు అటాక్ జేస్తరా అని బిక్కు బిక్కుమంటూ బతకాలె. మల్లా అన్ని కోట్లు సంపాయించినా రాజుల సొమ్ము రాళ్ల పాలన్నట్టు, క్రిమినల్స్ సొమ్ము జప్తులు, సీజ్ లు అయితయే తప్ప ,ఇంకేం పాయిద ఉండది అని అనుకుంటున్నరు గీళ్ల ఆస్తుల వివరాలు తెలిసినోళ్లంత.