జగిత్యాల జిల్లా ధర్మపురిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మోసపోయి గర్భం దాల్చిన మైనర్ బాలిక గర్భస్రావంతో చనిపోయింది. దీంతో ఆమె తల్లి గుట్టు చప్పుడు కాకుండా శవాన్ని పూడ్చి పెట్టింది. నాటుపద్దతులతో డెలివరీ చేయాలని చూసి అది వికటించి నవజాత శిశువు సహా బాలిక కూడా మరణించడంతో గోదావరి అంత్యక్రియలు చేసింది. ఇరుగుపొరుగు వారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం తరలించారు.
ధర్మపురికి చెందిన 16 మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమపేరుతో మోసగించాడు. ఆమెను లొంగదీసుకోవడంతో గర్భం దాల్చింది. ఈ విషయం తల్లికి తెలియకపోవడంతో కడుపు నొప్పితో బాధపడుతున్న కూతురును డాక్టర్ వద్దకు తీసుకెళ్లింది. అప్పుడే ఆమెకు గర్భం వచ్చిందని తెలియడంతో ఎవరికీ అనుమానం రాకుండా ఇంటిలోనే ఉంచుతోంది. ఈ క్రమంలో నెలలు నిండటంతో ప్రసవ వేధనపడింది. ఆస్పత్రికి తీసుకెళ్తే విషయం బయటకొచ్చి పరువు పోతుందని ఆమె డెలివరి చేసేందుకు ప్రయత్నించింది. కానీ నవజాత శిశువు మరణించగా.. కొంతసేపటికే తీవ్ర అనారోగ్యంతో బాలిక కూడా చనిపోయింది. రెండు రోజుల క్రితం ఎవరికీ తెలియకుండా పూడ్చిపెట్టింది. ఈ విషయం బయటకు రావడంతో స్థానికంగా సంచలనం రేపింది.