నాగపూర్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్లో ఆసీస్పై భారత్ ఘన విజయం సాధించింది. భారత ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్లో రాణించి ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించారు. జడేజా, అశ్విన్ చెలరేగడంతో కేవలం మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగిసిపోయింది. తొలి ఇన్నింగ్స్లో 177 పరుగులకు ఆలౌటైన ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో కేవలం 91 పరుగులకే కుదేలైంది. అది కూడా ఒక్క సెషన్ లోనే కుప్పకూలింది. అశ్విన్ ఐదు వికెట్లు తీయగా, జడేజా, షమీ రెండు, అక్షర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక సిరీస్ లో 1-0 ఆధిక్యంలో టీం ఇండియా దూసుకెళ్లింది. మ్యాచ్ ముగిశాక మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఆసీస్ పని ఒక్క సెషన్లోనే అయిపోతుందని అస్సలు ఊహించలేదన్నాడు రోహిత్. “బౌలింగ్లో తీవ్రంగా కష్టపడాలని మేము ముందుగానే నిర్ణయించుకున్నాం. ప్రతీ సెషన్లో ఆసీస్ పై పట్టు సాధించాలని ప్రణాళిక వేసుకున్నాం. కానీ, ఆసీస్ ఒక సెషన్ లోనే అలౌట్ అవుతుందని అస్సలు అనుకోలేదు. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.” అని రోహిత్ కొనియాడాడు. పిచ్ పై వస్తున్న వార్తలను రోహిత్ ఖండించాడు. ఆస్ట్రేలియా జట్టు మానసిక స్థితి గురించి నాకు తెలియదు. మేం గత 3-4 సంవత్సరాలుగా ఇటువంటి పిచ్ లపైనే ఆడుతున్నామని తెలిపాడు. ఇండియా పిచ్పై రాణించాలంటే ఓ ప్రణాళిక ఉండాలని సూచించాడు.
సచిన్ రికార్డు సమం
ఇక రోహిత్ శర్మ మొదటి టెస్ట్ లో అద్భుతమైన శతకాన్ని సాధించాడు. వరుస వికెట్లు పడుతున్నా నిరాశ చెందకుండా స్కోర్ బోర్డును ముందుండి నడిపించాడు. 212 బంతుల్లో 2 సిక్సర్లు, 15 ఫోర్లతో 120 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో హిట్ మ్యాన్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సెంచరీ రికార్డును కూడా సమం చేయడం విశేషం.ఆస్ట్రేలియాపై అత్యధిక సెంచరీలు సాధించిన టీమిండియా ఓపెనర్గా సచిన్ టెండూల్కర్ రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. ఆస్ట్రేలియాపై ఓపెనర్గా సచిన్ టెండూల్కర్ 9 సెంచరీలు చేయగా.ఇప్పుడు ఈ రికార్డును రోహిత్ సమం చేశాడు. వన్డేల్లో 8 సెంచరీలు చేసిన రోహిత్ శర్మ, ఇప్పుడు టెస్టుల్లో ఓ సెంచరీ చేశాడు.