తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పెద్ద ఎత్తున నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఉద్యోగార్థులు కోచింగ్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. మొత్తం 80 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు మొదలెట్టడంతో ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్న కసితో సన్నద్ధమవుతున్నారు. దీంతో పలు లైబ్రరీలు, రీడింగ్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. ఇక ఇదే అదనుగా కోచింగ్ సెంటర్లు భారీగా ఫీజుల పెంచేశాయి. దీంతో నిరుపేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు పలు సంస్థలు ముందుకొచ్చి ఉచిత కోచింగ్లు కూడా ఏర్పాటు చేశాయి.
వీటిల్లో భాగంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న బ్రాహ్మణ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, పుస్తకాల పంపిణీ కోసం దరఖాస్తుల గడువును మే 12 వరకు పొడిగించినట్లు తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఛైర్మన్ ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి తెలిపారు. గతంలో ఈ గడువు ఈరోజు (మే 7వ తేదీ) వరకే ఉండగా… వివిధ సంఘాలు, అభ్యర్థుల వినతి మేరకు దానిని మరో 5 రోజులు(మే 12 వరకు) పెంచామని తెలిపారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సహకారంతో బ్రాహ్మణ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, స్టడీ మెటీరియల్ను అందజేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు ఇతర వివరాల కోసం అధికారిక వెబ్సైట్ brahminparishad.telangana.gov.in ను సందర్శించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని రమణాచారి సూచించారు.