ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడును తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఘనగా సత్కరించింది. రాజ్ భవన్లో ఆయనకు పౌర సన్మానం చేశారు. ఉపరాష్ట్రపతి అయ్యాక తొలిసారి హైదరాబాద్ కు వచ్చిన వెంకయ్యకు బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. తర్వాత రాజ్ భవన్ లో సత్కరించారు.
తమ పదవులకు వన్నె తెచ్చే నేతలు వెంకయ్యనాయుడి వంటివారిలా చాలా కొద్దిమందే ఉంటారని కేసీఆర్ కొనియాడారు. వెంకయ్య ఉన్నత స్థాయికి ఎదిగినా తను వచ్చిన రైతాంగ మూలాలను మరచిపోలేదని అన్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వెంకయ్య ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నిక కావడం సాధారణ విషయమేమీ కాదన్నారు. కాగా, వెంకయ్య నాయుడు ప్రజా సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రశంసించారు. ఆయన ఉప రాష్ట్రపతి కావడం తెలుగు ప్రజలకు గర్వకారణమని అన్నారు. వెంకయ్య రాజ్యసభను సమర్థంగా నిర్వహిస్తారనే ధీమా తనకుందని గవర్నర్ అన్నారు.