ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి ఓ కీలక విషయాన్ని తెలియజేశారు. రెండవ రోజు జగన్ దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న విషయం తెలిసిందే. సదస్సులో జగన్.. ‘ఫ్యూచర్ ఫ్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్’ అనే అంశంపై మాట్లాడారు. ఏపీ ప్రజల ఆరోగ్య పరిరక్షణ విషయంలో వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడమే మా ముఖ్య బాధ్యత అని ఆయన అన్నారు. ప్రజలకు ఏవైనా రోగాలు వస్తే, వాటికి సరైన సమయంలో వైద్యం అందించాలనే లక్ష్యంతో రాష్ట వ్యాప్తంగా హెల్త్కేర్ సిస్టమ్ని రెడీ చేశామని పేర్కొన్నారు.
”రాష్ట్రంలో రెండు వేల జనాభా కల్గిన ఒక గ్రామంలో విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేశాం. వీటిపైన ప్రతీ 13 వేల జనాభా మండలం యూనిట్గా రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పాము. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నలుగురు డాక్టర్లు ఉంటారు. అంటే ప్రతీ పీహెచ్సీకి ఇద్దరు డాక్టర్లు ఉంటారు. ఈ పీహెచ్సీలకు అనుబంధంగా 104 అంబులెన్సులు ఉంటాయి. పీహెచ్సీలో ఉన్న డాక్టర్లకు కొన్ని గ్రామాల బాధ్యతలను అప్పగించాం. రోజు విడిచి రోజు ఈ డాక్టర్లు అంబులెన్సుల ద్వారా గ్రామాలకు వెళ్తారు. అక్కడి ప్రజలతో మాట్లాడుతారు. వీరంతా ఆ గ్రామంలోని ప్రజలకు ఫ్యామిలీ డాక్టర్లుగా మారుతారు. పేరు పెట్టి పిలిచే సాన్నిహిత్యంతోపాటు ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ డాక్టర్లకు తెలుస్తుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఏదైనా సమస్యలు వచ్చినా మొగ్గ దశలోనే దానికి చికిత్స అందించే వీలు ఉంటుంది”.