తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫాదర్స్ డే సందర్భంగా ఓ బంపర్ ఆఫర్ను ప్రకటించింది. ఈ నెల 19న రాష్ట్ర వ్యాప్తంగా ఐదేండ్లలోపు ఉన్న పిల్లలతో, తల్లిదండ్రులు కలిసి అన్నీ ఆర్టీసీ బస్సుల్లో ఆ రోజంతా ఉచితంగా ప్రయాణం చేసేలా అవకాశాన్ని కల్పిస్తున్నామని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘పిల్లల విషయంలో తల్లిదండ్రుల పాత్ర మాటల్లో వర్ణించలేనిది. పిల్లల కోసం తల్లిదండ్రులు పడే కష్టం, కృషిని తలుచుకుంటూ ఫాదర్స్ డే సందర్భంగా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాం’ అని వారు పేర్కొన్నారు.
అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని ఇటీవలే టీఎస్ ఆర్టీసీ తల్లులకు ఐదేండ్లలోపు చిన్నారులతో కలిసి అన్నీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా అవకాశాన్ని కల్పించిన విషయం తెలిసిందే. ”అమ్మ అనురాగాన్ని, ప్రేమను వెలకట్టలేము, ఆ త్యాగమూర్తుల విశిష్ట సేవలను గుర్తుచేసుకుంటూ, ఈ నిర్ణయం తీసుకున్నాం.” అని సజ్జనార్ అన్నారు. తాజాగా ఫాదర్స్ డేను పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా ఐదేండ్ల లోపు ఉన్న పిల్లలతో తల్లిదండ్రులు కలిసి ప్రయాణించేలా అవకాశాన్ని కల్పించారు.