అర్ధరాత్రి లారీలో పేలిన 100కి పైగా గ్యాస్ సిలిండర్లు
ఏపీలోని ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గురువారం అర్ధరాత్రి దాటాక పెను ప్రమాదం చోటు చేసుకుంది. నిండుగా ఉన్న గ్యాస్ సిలిండర్లతో వెళుతున్న లారీలో మంటలు చెలరేగాయి. మండలంలోని దద్దవాడ గ్రామం వద్ద అనంతపురం-గుంటూరు జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. లారీలో 300కి పైగా సిలిండర్లు ఉండగా.. వాటిలో 100కిపైగా పేలాయి. దీంతో లారీ పూర్తిగా దగ్ధమైంది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు నుంచి నెల్లూరు జిల్లా ఉలవపాడుకు భారత్ గ్యాస్ సిలిండర్లతో వెళుతున్న లారీ క్యాబిన్లో మంటలు వచ్చాయి. గమనించిన వెంటనే డ్రైవర్ మోహన్రాజు లారీ ఆపి కిందికి దిగి తప్పించుకున్నారు. ఇంజన్లో మంటలు చెలరేగి లారీకి వ్యాపించాయి. మంటల దాటికి గ్యాస్ సిలిండర్లు పేలి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించాయి. కానీ.. గ్యాస్ సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలడంతో మంటలను ఫైర్ సిబ్బంది కూడా అదుపులోకి తీసుకురాలేకపోయారు. మంటల్లో ఉన్నవి నిండు గ్యాస్ సిలిండర్లు కావడంతో జాతీయ రహదారిపై ఇరు వైపులా అర కి.మీ. దూరంలో వాహనాలు నిలిపివేశారు. కొంచెం సేపటికి సిలిండర్లు పేలడం ప్రారంభం కావడంతో పోలీసులు అప్రమత్తమై అటువైపు ఎవరినీ వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. భారీ శబ్దంతో సిలిండర్లు పేలడంతో రాత్రంతా దద్దవాడ గ్రామ ప్రజలు బిక్కుబిక్కు మంటూ గడిపారు
మంటల వేడికి సిలిండర్లు పేలడంతో అప్రమత్తమైన హైవే పోలీసులు ప్రమాద స్థలానికి 300 మీటర్ల దూరంలో ఉన్న దద్దవాడలో సుమారు 30 ఇళ్లను ఖాళీ చేయించారు. ప్రమాద స్థలానికి అగ్నిమాపక వాహనం వెళ్లినప్పటికీ సిలిండర్లు పేలుతుండటంతో 200 మీటర్ల దూరం నుంచే మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. గ్యాస్ లారీలో సిలిండర్లు భారీగా పేలడంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్రభయాందోళనకు గురయ్యారు. అటువైపు రాకపోకలను నిలిపేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.