సికింద్రాబాద్కు చేరుకున్న రైలు.. లాక్డౌన్ తర్వాత తొలిసారి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చాలా కాలం తర్వాత రైలు కూత పెట్టింది. ప్రయాణికుల రాకపోకలు బుధవారం ఉదయం నుంచి ప్రారంభం అయ్యాయి. కేంద్రం ఇటీవల పరిమిత సంఖ్యలో రైళ్లను నడిపాలని నిర్ణయించడంతో బెంగుళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న రైలు సికింద్రాబాద్ స్టేషన్కు వచ్చింది. 10వ నెంబర్ ప్లాట్ ఫాం నుంచి ప్రయాణికులకు సేవలను ప్రారంభించారు.దీంతో సుదీర్ఘ విరామం తర్వాత ఆ ప్రాంతంలో ప్రయాణికుల సందడి కనబడింది.
ఈ ప్రత్యేక రైలులో బెంగుళూర్ నుంచి 243 మంది ప్రయాణికులు నగరానికి చేరుకున్నారు. 288 మంది ప్రయాణికులను ఢిల్లీకి పంపించారు. అందరికి కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాతనే ప్రయాణానికి అనుమతించారు. మాస్కులు, శానిటైజర్లను వెంట తెచ్చుకునే లోపలికి పంపారు. భౌతిక దూరం పాటిస్తూ.. గమ్యానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. రైలు ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరి చేతికి అధికారులు స్టాంప్ వేస్తున్నారు. నగరానికి వచ్చిన వారిని కూడా హోం క్వారంటైన్లో ఉండాలని సూచిస్తున్నారు. ఏదైనా అనారోగ్య లక్షణాలు కనబడితే వెంటనే వైద్యులను సంప్రధించాలని సూచించారు. కాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం పరిమిత సంఖ్యలో కొన్ని రూట్లలో రైలు ప్రయాణాలను ప్రారంభించింది. ఆన్లైన్ ద్వారా టికెట్ బుకింగ్ సదుపాయం కల్పించారు.