ఏటీఎం మాదిరి మెషీన్లలో ఆహార ధాన్యాలు.. రాష్ట్రంలో కొత్త ప్రయోగం
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త యంత్రాలు పురుడుపోసుకుంటున్నాయి. రెండు వైపులా పదునున్న సాంకేతికతను మంచికి వాడుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయి. దానికి నిదర్శనం ఒడిషా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఆ రాష్ట్రంలో ఇక నుంచి ఏటీఎం మెషీన్లలో డబ్బులు వచ్చినట్టుగా ఆహార ధాన్యాలను ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఏటీఎం లాగా ఏటీజీ (ఆల్టైం గ్రెయిన్) పేరుతో డిస్పెన్సింగ్ మెషీన్లను పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్టు సంబంధిత శాఖ మంత్రి అతాను నాయక్ వెల్లడించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా పేదలకు అందజేసే బియ్యం, పప్పులు ఇతర సామాగ్రి ఇక నుంచి రేషన్ డీలర్ల ద్వారా మాత్రమే కాకుండా ఇలా మెషీన్ల నుంచి కూడా సప్లై చేయడానికి పూనుకున్నట్టు ఆయన తెలిపారు. ప్రాథమికంగా భువనేశ్వర్లో ఏర్పాటు చేసి దశల వారీగా విస్తరించనున్నట్టు పేర్కొన్నారు. ఇందుకోసం లబ్దిదారులకు ప్రత్యేక రకమైన కార్డులను ఇస్తామని స్పష్టం చేశారు. దీనివల్ల తప్పనిసరిగా రేషన్ డీలర్ల వద్దకు వెళ్లాల్సిన భారం తగ్గుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదికాక, రైతులకు వడ్డీలేని రుణాల పరిమితిని రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచినట్టు తెలిపారు.