కరోనా మహమ్మారి సోకిన రోగులకు ఎలాంటి చికిత్స చేస్తారు? ఎలాంటి మందులు ఇస్తారో తెలసుకున్నాం. మరి కరోనా రోగులకు ఎలాంటి ఆహారం ఇస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. కరోనా నియంత్రణలో రోగనిరోధక శక్తి చాలా ప్రాముఖ్యం అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్యులు వారికి అలాంటి ఆహారమే అందిస్తారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరోనా రోగులకు.. జీడిపప్పు, బాదం, గుడ్లు అందిస్తోంది. క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్న కరోనా బాధితులకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ఆహారం మెనూ ఇదే. కరోనా వైరస్కు సంబంధించి క్వారంటైన్లో ఉన్న వ్యక్తుల్లో రోగ నిరోధక శక్తి పెంచడంపై అధికారులు శ్రద్ధపెట్టారు. నిత్యం వారికి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. అలాగే రోజు వైద్య పరీక్షలు చేస్తున్నారు. పరిశుభ్రతలో భాగంగా దుస్తులు, టవల్స్, దుప్పట్లను అధికారులు అందజేస్తున్నారు. వీరికి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సహకారం అందిస్తున్నాయి.
మరోవైపు కృష్ణా జిల్లాలో ప్రభుత్వం మొత్తం 19 క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో ప్రస్తుతం 16 కేంద్రాల్లో 450 మంది వ్యక్తులు ఉన్నారు. వీరికి రోజూ కూర, పప్పు, రసం, సాంబారు, పెరుగుతో భోజనం అందిస్తున్నారు. వీటికి అదనంగా కోడిగుడ్డు, బాదం, జీడిపప్పు, అరటిపండు, ఎండుద్రాక్ష, ఖర్జూరం, కొబ్బరి నీళ్లు ఇస్తున్నారు. రోజువారీ జీవనానికి అవసరమైన 15 రకాల వస్తువులతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. వీటిలో పేస్టు, బ్రష్, సబ్బులు, షాంపూలు, కొబ్బరినూనె, దువ్వెన, షేవింగ్ కిట్, పౌడర్లు ఉన్నాయి.