లాక్డౌన్ 4 అమలుకు సిద్ధం.. ఆ 30 జిల్లాల్లో హైదరాబాద్ సైతం!
శాంతించని కరోనా మహమ్మారితో లాక్డౌన్ 4 కొనసాగుతుందని ప్రధాని మోదీ వెల్లడించిన విషయం తెలిసిందే. నేటితో 3వ లాక్డౌన్ ముగియనుంది. తదుపరి లాక్డౌన్కు కొన్ని మినహాయింపులు ఉంటాయని.. మునుపటిలా కఠినంగా ఉండదని మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా 30 జిల్లాల్లో కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆయా జిల్లాల్లో లాక్డౌన్4 అమలుకు కేంద్రం కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. 80 శాతం కేసులు ఆ జిల్లాల్లోనే ఉండగా, లాక్డౌన్ 4ను ఎలా అమలు చేయబోతున్నారనేది తేలాల్సి ఉంది. ఆ 30 జిల్లాల మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కేంద్రం చర్చించిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ 30 మున్సిపాలిటీల్లో కరోనా ఆంక్షలు అత్యంత కఠినంగా ఉంటాయని, మిగతా ప్రాంతాల్లో పెద్దగా ఆంక్షలు ఉండవట.
ఆ 30 జిల్లాల్లోని ప్రజలు ఎలా ఉండాలి? వస్తు రవాణా ఎలా జరగాలన్న అంశంపై కేంద్రం ప్రణాళికలు చేస్తున్నట్టు సమాచారం. ఆ జిల్లాల్లోనే కఠిన నియమాలను విధిస్తూ.. మిగతా చోట్ల అంత కఠనంగా ఉండవు. ఆ ముప్ఫై జిల్లాల్లో రాష్ట్రంలోని గ్రేటర్ హైదరాబాద్ కూడా ఉంది. ఔరంగాబాద్, బృహన్ ముంబై, గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ చెన్నై, అహ్మదాబాద్, థానే, ఢిల్లీ, ఇండోర్, పుణె, కోల్కతా, ఆగ్రా, జైపూర్, నాసిక్, జోధ్పూర్, తిరువళ్లూర్, కడలూరు, సూరత్, చెంగల్పట్టు, హౌరా, అరియాలూర్, కుందూర్, మీరట్, భోపాల్, అమృత్సర్, మీరట్, విల్లుప్పురం, వడోదర, ఉదయ్పూర్, పాల్ఘర్, బెహ్రాంపూర్, సోలాపూర్ జిల్లాలు ఉన్నాయి. అక్కడ మే 31 వరకు కఠిన ఆంక్షలు అమలు కానున్నాయి.