తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో తొలిసారిగా ఆదివారం ఒక్కరోజే వెంకన్న స్వామివారికి రూ.6.18కోట్ల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. దాదాపు పదేళ్ల కిందట వెంకన్న స్వామివారికి ఒకే రోజు రూ.5.73కోట్లు వచ్చాయని, ఆ తర్వాత మళ్లీ 2012 ఏప్రిల్ ఒకటిన అంతే ఆదాయం లభించిందని ఆ రికార్డును బ్రేక్ చేస్తూ, ఆదివారం ఒక్కరోజే స్వామివారికి రూ.6.18కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.
ఈ ఆదాయానికి సంబంధించిన వివరాలను టీటీడీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. విడుదల చేసిన ప్రకటనలో..”ఆదివారం తిరుమల వెంకన్న హుండీలో సమర్పించిన ఆదాయాన్ని సోమవారం లెక్కించాము. ఈ లెక్కింపులో టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. హుండీల ద్వారా భక్తులు సమర్పించిన విరాళాల విలువ రూ.6.18 కోట్లుగా తేలింది. టీటీడీకి గతకొన్ని రోజులుగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ.. ప్రభుత్వం వీఐపీ బ్రేక్ దర్శనాలపై ఆంక్షలు విధించింది. ఈ నెల 15 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి” అని అధికారులు పేర్కొన్నారు.