దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆవులని, మేకలను పెంచాలని.. తద్వారా పాడి పరిశ్రమను పెంపొందించాలంటూ ఎన్నో పథకాలు చేపడుతున్నాయి. కర్ణాటకలోని ఓ గ్రామంలో మాత్రం ఎక్కువ ఆవులు, మేకలను పెంచవద్దని అటవీ శాఖ నోటీసులు జారీచేసింది. చామరాజనగర్ జిల్లా కావేరి వన్యప్రాణుల అభయారణ్యం పరిధిలోని గోపీనాథం గ్రామస్థులను అవసరమైనన్ని ఆవులు, మేకలను మాత్రమే ఉంచాలని, అదనపు వాటిని వేరే చోటుకు తరలించాలని ఆ నోటీసులలో కోరింది. పశువులను అడవుల్లోకి పంపడం వల్లే అడవి నాశనమవుతోందని తెలిపింది. ఈ ప్రకటనపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఆ ప్రాంతంలో రెండు రోజుల పర్యటనలో పాల్గొన్న అటవీ శాఖ అధికారుల బృందం.. గ్రామంలో చాలా పశువులు ఉండటాన్ని గమనించింది. ఈ పశువులన్నింటిని మేత కోసం అడవికి తీసుకెళ్లడం వల్లే.. అడవి నాశనమవుతోందని భావించింది. దీంతో కేవలం వ్యవసాయానికి అవసరమైన ఆవులు, మేకలను ఉంచి.. మిగిలిన వాటిని వేరే చోటుకు తరలించాలని ఆదేశించింది. అలా అని వాటిని అడవిలో వదిలేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు.
అటవీ శాఖ ఇచ్చిన నోటీసుపై రైతు సంఘం నాయకుడు హొన్నూరు ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “గో సంరక్షణ కోసం ప్రభుత్వం చట్టం చేసింది. అయితే ఆవులను పెంచకూడదని అటవీశాఖ చెబుతోంది. ఫారెస్ట్ సైడ్లో నివసించే వారికి పశువులను మేపేందుకు అనుమతిస్తామని సుప్రీంకోర్టు చెప్పినా.. అటవీశాఖ మాత్రం ఈ నోటీసులిచ్చింది. మరో వారం రోజుల్లో నోటీసును ఉపసంహరించుకోకుంటే పోరాటం చేస్తామని” ప్రకాష్ అన్నారు.