four years boy came for a bail to bihar court
mictv telugu

బెయిల్ కోసం కోర్టుకు వచ్చిన నాలుగేళ్ళ బాలుడు

March 18, 2023

రక్షించాల్సిన పోలీసులే భక్షకులు అయిన ఘటనలు మ దేశంలో కోకొల్లలు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో, ఎందుకు కేసులుపెడతారో, ఎవరని వదిలేస్తారో చాలా సార్లు అర్ధం కాదు. అందరు పోలీసులు ఒకేలా ఉండరు, చెడ్డవారు కాదు కానీ…పోలీసుల మీద వ్యతిరేకత చాలానే వినిపిస్తుంటుంది మన దేశంలో. ఇప్పుడు బీహార్ లో జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కోర్టు సైతం నివ్వెరపోయింది.

బిహార్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో.. నాలుగేళ్ల బాలుడు చేసిన తప్పేంటి? అతగాడి నేరం ఏమిటి? అన్న ప్రశ్నలు వేయటానికి ముందు.. ఆ పిల్లాడి మీద పెట్టిన కేసు.. వాడు రెండేళ్ళ వయసులో ఉన్నప్పుడు చేశాడని చెప్పటం ఈ మొత్తం ఎపిసోడ్ లోనే హైలెట్ గా చెప్పాలి. అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే..

బిహార్ లోని బెగుసరాయ్ జిల్లాకు చెందిన ఒక బాలుడితో సహా మొత్తం ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అది కూడా 2021 ఏప్రిల్ లో. కొవిడ్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కొన్ని ప్రాంతాల్ని కంటైన్ మెంట్ చేయటం తెలిసిందే. అప్పుడు ఏర్పాటు చేసిన బారికేడ్లను రెండేళ్ళ వయసున్న బాలుడితో సహా మొత్తం ఎనిమిది మంది తొలగించారని.. దీని కారణంగా కొవిడ్ వ్యాప్తి చెందినట్లుగా ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు.

ఈ కేసు రెండేళ్ళ నుంచే నడుస్తోంది. కోవిడ్ వచ్చింది, వెల్ళిపోయింది కూడాను. కనీసం ఇప్పుడైనా పోలీసులు కేసును కొట్టేయొచ్చు కదా అబ్బే లేదు. రెండేళ్ళ క్రితం పోలీసులు పెట్టిన కేసుకు సంబంధించిన విషయం తాజాగా తెలుసుకున్న ఆ బాలుడి తల్లి.. భయాందోళనతో జిల్లా కోర్టుకు వచ్చింది. తనతోపాటు తన నాలుగేళ్ళ వయసున్న కొడుకును కోర్టుకు తీసుకొచ్చి.. తన పిల్లాడిని అరెస్టు చేయకుండా ఉండేందుకు వీలుగా బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు.. విషయం తెలిసి అవాక్కయిపోయింది.

చిన్నారి మీద ఇలాంటి కేసులు పెట్టటానికి.. బెయిల్ ఇవ్వటానికి ఎలాంటి నిబంధనలు లేవని స్పష్టం చేసింది బీహార్ లోని బెగుసరాయ్ కోర్టు. అధికారుల తీరుపై మండిపడ్డ న్యాయస్థానం పిల్లాడిపై ఉన్న కేసును కొట్టేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు వైరల్ గా మారింది.