హిండెన్బర్గ్ నివేదిక ఫలితంగా లక్షల కోట్లు నష్టపోయిన అదానీ గ్రూప్ వాటాదారుల నమ్మకాన్ని తిరిగి పొందడానికి నానా తిప్పలూ పడుతోంది. ఇప్పటికే వేల కోట్ల అప్పుచెల్లించిన కంపెనీ తాజా మరో రూ. 7,374 కోట్ల అప్పును తీర్చేసింది. అదికూడా గడువుకు దాదాపు మూడేళ్లకు ముందే చెల్లించడం గమనార్హం. దీంతో ఈ అప్పు తీసుకోవడానికి తనఖా పెట్టిన కంపెనీల షేర్లు విడుదలైనట్లు ఆదానీ గ్రూప్ మంగళవారం తెలిపింది. 2025 వరకు గడువున్నా అప్పుల భారాన్ని తగ్గించుకుంటామని ఇచ్చిన హామీ మేరకు ఈ చెల్లింపు చేసినట్లు పేర్కొంది. విడుదలైన షేర్లలో ఆదానీ పోర్ట్స్(15.5 కోట్ల షేర్లు), ఆదానీ ట్రాన్స్ మిషన్(3.1 కోట్ల), ఆదానీ గ్రీన్(1.1 కోట్ల షేర్లు) ఉన్నాయి. విదేశీ బ్యాంకుల, దేశీ సంస్థలకు ఈ రుణాలను చెల్లవేసినట్లు వెల్లడించినట్లు కంపెనీ తెలిపింది. గత నెల ఆదానీ గ్రూపు 9 వేల కోట్ల రుణాలను చెల్లించడం తెలిసిందే. కాగా, ఆదానీ గ్రూప్ కంపెనీల పరిస్థితి మెరుగుపడ్డంతో అదనపు నిఘా నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్ను తొలగిస్తున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ తెలిపాయి. అదానీ గ్రూపులోని పలు కంపెనీలు దొంగ లెక్కలు చూపాయని, పలు అక్రమాలకు పాల్పడ్డాయని అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక ఇవ్వడం తెలిసిందే.