జెమినీ న్యూస్ తెలుగు టీవీ చానల్ మూసివేతకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. సన్ టీవీ నెట్ వర్క్ లో భాగమైన ఉదయ న్యూస్ కన్నడ టీవీ చానల్ మూసివేతను అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో అందులో భాగమైన జెమినీ న్యూస్ భవితవ్యంపై సందేహాలు వచ్చాయి. ఈ చానల్ ను కూడా మూసేస్తున్నట్లు గురువారం సంకేతాలు అందాయి. జెమినీ న్యూస్ మూసి వేయాలని సన్ టీవీ యాజమాన్యం నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. జెమినీ న్యూస్ తెలుగు చానల్ ఉద్యోగులకు ఈ ఏడాడి అక్టోబర్ 24 వరకు గడువు ఇచ్చారని, ఈమేరకు చెన్నై ప్రధాన కార్యాలయంలోని జనరల్ మేనేజర్ నుంచి సమాచారం అందిందని ఆ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ లోని మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఈ అంశంపై ఉద్యోగులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, విషయాన్ని వివరించినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం జెమినీ న్యూస్ చానల్లో 70 మందివరకు ఉద్యోగులు ఉన్నారు. మూత పడునున్న ఉదయ చానల్లోనూ 73 మంది ఉద్యోగులు ఉన్నారు. ఉదయను అక్టోబర్ 24న మూసేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది.