రోజులు పెరుగుతున్నా కరోనా మాత్రం తాను తగ్గను అంటోంది. దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా చతికిల పడుతున్నా లాక్డౌన్ పొడిగిస్తోంది కేంద్రం. ఇదే అదనుగా కరోనా మరింత విజృంభించడంతో ప్రజల్లో ప్రాణభయం పట్టుకుంది. ఒక్కరోజులో ఎక్కువగా కేసులు వెలుగు చూస్తున్న దేశాల జాబితాలో భారత్ టాప్- 5లో నిలిచింది. అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత అత్యధికంగా భారత్లోనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ గణాంకాలు అటు ప్రభుత్వాలను, ఇటు ప్రజలను కలవరపెడుతున్నాయి. మే నెల ప్రారంభంలో దేశంలో ఒకరోజు కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య 2,400 దాటింది. మే మొదటి వారం తర్వాత ఆ సంఖ్య 3 వేలు దాటింది. గత వారం రోజులుగా కొత్తగా వస్తున్న కేసుల సంఖ్య 5-6 వేల మధ్య (మే 19 మినహా) ఉంటోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 6,654 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక్కరోజు వ్యవధిలో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,25,101కి చేరింది. మృతుల సంఖ్య 3,720కి పెరిగింది.
ఇతర దేశాల విషయంలో.. అమెరికానే అగ్రస్థానంలో నిలిచింది. అక్కడ 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే మరణాలు 97వేలు దాటగా మొత్తం కేసుల సంఖ్య 16.32 లక్షలు దాటింది. ఇక బ్రెజిల్లో సైతం గత కొన్ని రోజులుగా 20వేల కేసులు నమోదు అవుతూ రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం మొత్తం అక్కడ 3.14 లక్షల పాజిటివ్ కేసులు నమోదవగా, 20వేలకు పైగా మృత్యువాత పడ్డారు. రష్యాలో 8 వేల వరకు కొత్త కేసులు నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 3.26 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 3,249కి చేరింది. ఇక భారత్లో కరోనా కేసుల సంఖ్య మొదట్లో తక్కువగా నమోదు కావడానికి పరీక్షల సంఖ్య కూడా ఓ కారణం. ఇటీవల కరోనా నిర్ధారణ పరీక్షలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు లక్ష వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. కాగా, దేశంలో ప్రస్తుతం మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.25 లక్షలకు చేరింది. అలాగే కోలుకుంటున్న వారి సంఖ్య 41.39గా ఉంది. ఇవాళ విడుదల చేసిన తాజా బులెటిన్లో 51,783 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.