Goa beachలో తెలంగాణ వ్యక్తి రచ్చ.. సన్యాస్ను అరెస్ట్ చేసిన పోలీసులు
ఏదైనా పర్యాటక స్థలానికి వెళ్తే.. వెళ్లామా, ఎంజాయ్ చేశామా, తిరిగొచ్చామా.. అన్నట్లుండాలి. అలా కాకుండా ఎంజాయ్మెంట్ పేరుతో తోటివారికి ఇబ్బంది కలిగిస్తే.. జైల్లోకి నెడతారు పోలీసులు. గోవా టూర్ కి వెళ్లిన తెలంగాణ వ్యక్తికి ఇదే అనుభం ఎదురైంది. గోవాలోని మోర్జిమ్ బీచ్కు వెళ్లిన ఆ వ్యక్తి.. బీచ్లోకి కారును తీసుకెళ్లి.. ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. దీంతో అక్కడ ఉన్న ఇతర పర్యాటకుల ప్రాణాలను ప్రమాదంలో పడేశాడు. మోర్జిమ్ బీచ్లో సాధారణంగా తాబేళ్లు గుడ్లను పొదుగుతాయి కూడా. కాబట్టి అక్కడ నిబంధనలు కూడా ఎక్కువే. అలాంటి బీచ్లో ఆ వ్యక్తి ఇష్టారీతిన కారు నడిపినందుకు అరెస్ట్ చేశామని సియోలిమ్ కోస్టల్ సెక్యూరిటీ పోలీసు స్టేషన్ అధికారులు వివరించారు.
ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పెర్నెమ్ పోలీసులకు అప్పగించామని, వారు అతనిపై కేసు నమోదు చేశారని సియోలిమ్ కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసిన తర్వాత బెయిల్ పై విడిచి పెట్టామని పెర్నెమ్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ సచిన్ లోక్రె వివరించారు. సదరు వ్యక్తిని తెలంగాణకు చెందిన సన్యాస్ యాదవ్గా గుర్తించినట్టు తెలిపారు. గోవా టూరిజం డిపార్ట్మెంట్ అడ్వైజరీ ప్రకారం, బీచ్లలో టూ వీలర్లు సహా ఇతర మోటార్ వాహనాలను నడపడం నిషేధం. ఈ నిబంధన ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఆ వాహనాన్ని సీజ్ చేసి డ్రైవర్ను అరెస్టు కూడా చేయవచ్చు.