రూ.800కే ఏసీ..32 డిగ్రీల నుంచి 23 డిగ్రీలకు తగ్గిస్తుంది
మధ్య తరగతి ప్రజలకు ఇప్పటికే ఏసీ ఖరీదైన వ్యవహారమే. కానీ, గుజరాత్లోని వడోదరకు చెందిన మనోజ్ పటేల్ అనే వ్యక్తి రూ.800తోనే ఏసీ తయారు చేశారు. మట్టిలోని అతిసూక్ష్మ రంధ్రాల గుండా వెళ్లే నీరు ఆవిరి కావడం చల్లదనానికి కారణమని తెలిసిన విషయమే. సరిగ్గా ఇదే ఆలోచనతో మనోజ్ చిన్నసైజు ఏసీని తయారు చేశారు. కాకపోతే ఇందులో మట్టికి బదులుగా పింగాణీ ఉపయోగించాడు.
ప్రస్తుతం మనోజ్ మూడు రకాల ఏసీలను తయారు చేశారు. ఒకదాంట్లో పైన ట్యాంకులోని నీటి మోతాదును చెప్పేందుకు ఓ సూచికతో పాటు ఓ మొక్క పెంచేందుకు ఏర్పాట్లు ఉంటాయి. గది ఉష్ణోగ్రతలను 32 డిగ్రీల నుంచి 23 డిగ్రీల స్థాయికి తీసుకు రాగల ఈ ఏసీలకు కరెంటు అవసరమే ఉండదు. వ్యక్తిగత పింగాణీ ఏసీలో మాత్రం ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది. పైగా ట్యాంకును ఒకసారి నింపితే 10–12 రోజుల వరకు ఆ నీటినే వాడుకోవచ్చు. ఈ ఏసీ గురించి మనోజ్ మాట్లాడుతూ.. పింగాణీ, రాళ్లు, మట్టి మాత్రమే వాడటం వల్ల ఖర్చు తక్కువ అయిందంటారు.