కామాంధులు రోజురోజుకి రెచ్చిపోతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను కూడా వదలడం లేదు. ఇటీవల ఢిల్లీకి సమీపంలో ఉన్న గురుగ్రామ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న యువతి(21)పై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. అత్యాచారం జరగడంతో ఆమె ఆరోగ్యం మరోసారి క్షిణించింది. సంఘటన జరిగిన ఆరు రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన ఆమె.. మంగళవారం తన తండ్రికి ఈ దారుణం గురించి చెప్పింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టీబీలో బాధపడుతున్న బాధితురాలిని ఆమె కుటుంబం ఈ నెల 21న గురుగ్రాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించింది. ఐసీయూలో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
అదే ఆస్పత్రిలో పని చేస్తున్న వికాస్ అనే వ్యక్తి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో మరోసారి బాధితురాలి ఆరోగ్యం క్షీణించింది. కొంచెం కోలుకున్న తరువాత తనపై జరిగిన లైంగిక దాడి గురించి ఆమె తల్లిదండ్రులు చెప్పింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు స్థానిక సుశాంత్ లోక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడు వికాస్పై కేసు నమోదు చేశారు. ఆమె ఆరోగ్యం కుదుట పడిన తరువాత ఆసుపత్రికి వెళ్లి వాంగ్మూలం తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె మాట్లాడే పరిస్థితిలో లేదని వైద్యులు చెప్పారన్నారు. ఆధారాల కోసం ఆస్పత్రిలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదే ఆస్పత్రిలో తమ కూతురిని ఉంచినట్లయితే ఆధారాలు మాయం చేసే ప్రయత్నాలు జరుగుతాయని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమెను వెంటనే ప్రభుత్వ సుపత్రికి తరలించాలని పోలీసులను కోరారు.