ఉత్కంఠ రేపుతున్న చార్మి కేసులో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మహిళా లాయర్ల సమక్షంలోనే చార్మిని ప్రశ్నించాలని స్పష్టం చేసింది. అయితే తన వ్యక్తిగత న్యాయవాది సమక్షంలోనే విచారణ జరగాలన్న చార్మి విజ్ఞప్తిని అమలు చేయడం కుదరదని తేల్చి చెప్పింది. మంగళవారం ఉదయం వాదనలు విన్న తర్వాత తీర్పును మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేసింది. అనంతరం దీనిపై హైకోర్టు తీర్పును వెలువరించింది.
చార్మి లేవనెత్తిన అభ్యంతరాలపై స్పందించిన హైకోర్టు ఆమెను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని ఆదేశాలు జారీ చేసింది. మహిళా అధికారులు మాత్రమే విచారణ జరపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. చార్మి అనుమతి లేకుండా ఆమె రక్త నమూనాలను సేకరించకూడదని స్పష్టం చేసింది. ఆమె విచారణ ప్రక్రియ మొత్తం తన వ్యక్తిగత న్యాయవాది సమక్షంలోనే విచారించాలని పెట్టుకున్న అర్జీని మాత్రం హైకోర్టు తోసిపుచ్చింది. విచారణాధికారులకు ఏ విధంగా విచారణ జరపాలనే విషయంలో స్వేచ్ఛ ఉంటుందని హైకోర్ట్ స్పష్టం చేసింది.