లాక్‌డౌన్ క్యారమ్ బోర్డ్.. కాయిన్స్‌కు బదులు మనుషులు! - Telugu News - Mic tv
mictv telugu

లాక్‌డౌన్ క్యారమ్ బోర్డ్.. కాయిన్స్‌కు బదులు మనుషులు!

May 7, 2020

లాక్‌డౌన్‌తో ఇళ్లల్లో ఖాళీగా ఉంటూ పాత ఆటలను ముందు వేసుకుని ఆడుతూ చక్కగా టైంపాస్ చేస్తున్నారు. అష్టాచమ్మా, పులి మేకలు, పచ్చీస్, ఓమనగుంట, కచ్చకాయలు, వైకుంఠపాలి వంటి ఆటలు ఆడుతున్నారు. అయితే ఓచోట మాత్రం లాక్‌డౌన్ వేళ కొందరు క్యారంబోర్డు ఆటమీద తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. క్యారమ్స్ అనగానే మనకు నలుపు తెలుపు కాయిన్స్, స్టైకర్ గుర్తుకు వస్తాయి. కానీ వీరు మాత్రం వాటికి బదులు మనుషులనే పెట్టి మానవ క్యారమ్ అడారు. బోర్డు అవసరం లేకుండా వారు ఈ ఆటను ఆడారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది సాధ్యమేనని నిరూపించారు కొందరు కుర్రాళ్లు. ఇందుకు సంబంధించిన వీడియో టిక్‌టాక్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తికి పెరట్లో కొద్దిమందితో కలిసి మానవ క్యారమ్ ఆడితే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది. అంతే ఈ విషయాన్ని తన స్నేహితులకు చెప్పాడు. వారంతా ఏందిరా భాయ్ ఇదంతా అన్నారు. కానీ వారితోనే అతను ఈ ప్రయోగం చేశాడు. 

ఇందుకోసం ఖాళీ నేలపై పెద్దగా క్యారమ్‌ ఆకారాన్ని గీశాడు. కాయిన్స్‌, స్ట్రైకర్‌కు బదులుగా మనుషులను నిల్చోబెట్టాడు. తర్వాత స్ట్రైకర్ స్థానంలో ఓ మనిషిని నిల్చోబెట్టి ఆటగాడు అతడిని ముందుకు తోస్తాడు. అతను కొంచెం వేగంగా తోసిన దిశ వైపుగా వెళతాడు. దీంతో అక్కడ ఎవరైనా మనుషులు(కాయిన్స్‌) ఉంటే వాళ్లు ముందుకు తోసుకుంటూ వెళ్లి హోల్‌లో పడతారు. ఈ మానవ క్యారమ్‌లో స్థలాన్ని బట్టి మనుషుల సంఖ్యను పెంచుకునేందుకు అవకాశం ఉంది. ఈ వెరైటీ క్యారం‌బోర్డ్ ఆట ఇప్పుడు టిక్‌టాక్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ క్యారంబోర్డ్ ఆటను మొట్ట మొదటిసారిగా భారత్‌లోనే కనుగొన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఇది వివిధ దేశాలకు పాకింది. ప్రతీ ఇంట్లో ఇప్పుడీ ఆట చక్కని కాలక్షేపంగా మారింది.