హైదరాబాద్లో సంచలనం సృష్టించిన చిన్నారి నరబలి కేసు మిస్టరీ వీడింది. ఈ ఘాతుకానికి తెగబడింది క్యాబ్ డ్రైవర్ రాజశేఖరే అని తేలింది. అతని నేరాన్ని ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. చంద్రగ్రహణం రోజున చంద్రుని నీడ శిశువు తలపై పడేలా చూసేందుకు తలను మేడపైకి తీసుకెళ్లినట్లు అతడు అంగీకరించాడు.
ఉప్పల్ చిలుకానగర్ లో నివసిస్తున్న రాజశేఖర్ ఇంటిపైన మూడు నెలల చిన్నారి తల కనిపించడం కలకలం రేపడం తెలిసిందే. విచారణ ఎన్నో మలుపులు తిరిగింది. రాజశేఖర్ కుట్రల వల్ల ఎదురింటి నరహరినీ పోలీసులు అనుమానించారు. అయితే తమదైన వైలిలో విచారించడంతో రాజశేఖర్ నేరాన్ని ఒప్పుకున్నాడు. తన భార్య ఆరోగ్యంగా ఉండాలని ఆడశిశువు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి, గొంతు కోసి చంపానని వెల్లడించాడు.సికింద్రాబాద్ బోయిగూడలో ఫుట్పాత్పై పడుకున్న ఓ మహిళ వద్ద ఉన్న శిశువును ఆమెకు తెలియకుండా తీసుకొచ్చినట్లు తెలిపాడు.
బలి తర్వాత మొండాన్ని ప్రతాప సింగారం దగ్గర మూసీ నదిలో పడేశానని అతడు చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రగాడి సూచనపై తలను మాత్రం చంద్రుడి నీడ పడేలా డాబాపైన ఉంచానని తెలిపినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. చంద్రగహణం రోజున రాజశేఖర్, అతని భార్య శ్రీలత నగ్నంగా పూజలు చేశారని తెలిపాయి. ఈ కేసులో వీరిని సహా ఆరుగురిని అరెస్ట్ చేయడం తెలిసిందే.