తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో నల్లగండ్ల సిటిజన్ ఆసుపత్రి డాక్టర్లు తెగిపడిన అవయవాలను అతికించి, కార్మికుడికి మరో పునర్ జన్మను కల్పించారు. మంగళవారం వైద్యులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. “సంగారెడ్డి జిల్లా నందిగ్రామ్ ప్రాంతం పానియాల పరిశ్రమలో పని చేస్తున్న హరీష్ (22) చేయి యంత్రంలో పడి మణికట్టు వరకు తెగిపడింది. మణికట్టుని ఓ ప్లాస్టిక్ కవర్లో వేసి దాన్ని ఐస్లో పెట్టి తీసుకొచ్చారు. చాలా గంటలపాటు శ్రమించి, మణికట్టును తిరిగి అతికించాం. కొన్ని నెలల్లో తిరిగి చేయి మామూలు స్థితికి వస్తుంది. చేతులు, వేళ్లు, కాళ్ళ తెగిపడ్డప్పుడు వెంటనే అవయవాన్ని ప్లాస్టిక్ కవర్లో ఉంచి ఐస్లో పెట్టుకొని తీసుకురావాలి. ప్రమాదాలు జరిగిన వెంటనే క్షతగాత్రులకు తాగునీళ్లు ఇవ్వడం వంటి చర్యలు చేయవద్దు. ముందు అంబులెన్సు వచ్చే విధంగా చేయాలి. ఆరుగంటల వ్యవధి లోపు రోగిని ఆవయవాలను చేర్చితే వాటిని రక్షించడానికి అవకాశాలు ఉంటాయి” అని డాక్టర్లు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకొస్తే, ప్రమాదాల్లో తెగి పడిన అవయవాలను అతికించడానికి ఆస్కారం ఉంటుందని నల్లగండ్ల సిటిజన్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
ఇటీవలే నల్గొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి హైదరాబాద్లోని అవేర్ గ్లోబల్ హాస్పిటల్ వైద్యులు గంటపాటు సర్జరీ చేసి, కిడ్నీలో ఉన్న 206 రాళ్లను తొలగించిన విషయం తెలిసిందే. సర్జరీ అనంతరం ఆ రాళ్లను అతని కుటుంబ సభ్యులకు వైద్యులు చూపించడంతో ఒక్కసారిగా షాకైయ్యారు. ఈ క్రమంలో యంత్రంలో పడి మణికట్టు తెగిపడిన కార్మికుడికి మరో అరుదైన చికిత్స చేసి నల్లగండ్ల సిటిజన్ ఆసుపత్రి డాక్టర్లు మరో షాక్ ఇచ్చారు. సర్జరీ అనంతరం బాధితుడి కుటుంబ సభ్యులు వైద్యులు అశోక్ రాజు, వాసుదేవ జువ్వాడి, కిలారు ప్రపుల్, ప్లాస్టిక్ సర్జన్లు వెంకటేష్ బాబు, ఈథర్ రెడ్లకు ధన్యవాదాలు తెలిపారు.