భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. శీతాకాల విడిది కోసం తొలిసారి తెలంగాణ పర్యటనకు రానున్నారు. సోమవారం సాయంత్రం 4.15 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. వైమానిక దళం శిక్షణ కేంద్రంలో సీఎం, గవర్నర్, ఇతర ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. అనంతరం రాష్ట్రపతి నిలయానికి చేరుకోనున్నారు. ఇందుకోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని అధికారులు ముస్తాబు చేస్తున్నారు. రాష్ట్రపతి నిలయంలో ఐదు రోజుల పాటు ద్రౌపది ముర్ము బస చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన కారణంగా పోలీసులు నగరంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ మేరకు దీనికి సంబంధించి తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా బొల్లారం, సోమాజిగూడతో పాటు నగరంలో పలు ప్రాంతాల మధ్య ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 10 గంటల మధ్య ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. సోమవారం హకీంపేట్, తిరుమలగిరి, కార్ఖానా, సికింద్రాబాద్ క్లబ్, టివోలి, ప్లాజా, బేగంపేట్, రాజ్భవన్ రోడ్, సోమాజీగూడ మధ్య ట్రాఫిక్ ఆంక్షల విధించనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.
షామీర్ పేట నుంచి మేడ్చల్కు ORR ద్వారా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. అలాగే కరీంనగర్ మార్గం ద్వారా వచ్చే ప్రయాణికులు జేబీఎస్-అల్వాల్ మార్గంలో రావొద్దని, దానికి ప్రత్యామ్నాయంగా ORR-మేడ్చల్ లేదా ఘట్కేసర్ ఎగ్జిట్ ద్వారా కొంపల్లి, ఉప్పల్కు చేరుకోవాలని సూచించారు.