తెలుగు చిత్రసీమ పరిశ్రమలో మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి తెలియని వారుండరు. తాజాగా ఆయన ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ‘నా స్నేహితుని కుటుంబం నన్ను దారుణంగా మోసం చేసింది’ అని సంచలన విషయాలను వెల్లడించాడు. శివారెడ్డి మాట్లాడుతూ.. “ఫ్రెండ్స్ అంటే నాకు పిచ్చి. వాళ్లకోసం ఏదైనా చేస్తాను. హైదరాబాద్ వచ్చాక ఇక్కడ కూడా కొందరు ఫ్రెండ్స్ అయ్యారు. అందులో ఒక ఫ్రెండ్, అతడి కుటుంబం నన్ను దారుణంగా మోసం చేశారు.
నేను రాత్రి, పగలు కష్టపడి సుమారు రూ.70 లక్షల దాకా కూడబెట్టాను. కూడబెట్టిన ఆ డబ్బుతో మొట్టమొదటిసారిగా ఏదైనా ఇల్లు లేదా కొన్ని ఎకరాల భూమి కొనుక్కుందామని సిటీలో తిరిగాను. అప్పుడు ఏ ఇల్లు చూసినా, ల్యాండ్ చూసినా ఇది బాలేదులే, వద్దులే అంటూ ఆ ఫ్రెండ్ నన్ను మభ్యపెట్టాడో. ఆ సమయంలో అమెరికాలో నాకు ప్రోగ్రాం ఆఫర్ వచ్చింది. ఒక నెలన్నర వరకు అక్కడే ఉండాల్సిన పరిస్థితి. అప్పటికి నేను బ్యాచ్లర్ని. నా డబ్బును తీసుకుని వాళ్లింట్లో పెట్టుకున్నారు. నేను వెళ్లిపోయాక వాళ్ల అవసరాల కోసం ఉన్నదంతా వాడుకున్నారు. అమెరికా నుంచి తిరిగి రాగానే మళ్లీ ఇళ్లు చూడటం మొదలుపెట్టాను. డీల్ కుదిరింది. డబ్బులు తీసుకురమ్మన్నారు. అప్పుడు అతడు చిన్న సమస్య రావడంతో నీ డబ్బు వాడేసుకున్నామని అసలు విషయం బయటపెట్టాడు. ఐదారు రోజుల్లో తిరిగి ఇచ్చేస్తామన్నారు, కానీ ఈరోజు వరకు కూడా ఇవ్వలేదు. ఆ డబ్బులుండుంటే మణికొండలో నాకు రెండుమూడు ఎకరాలైనా ఉండేవి” అని చెప్తూ బాధపడ్డాడు.
మరోపక్క శివారెడ్డి వందకు పైగా సినిమాల్లో నటించాడు. దేశవిదేశాలు తిరుగుతూ, స్టేజీ షోలు చేశారు. నటీనటులను, రాజకీయ నాయకుల గొంతును ఇమిటేట్ చేస్తూ ప్రజలను ఎంటర్టైన్ చేసిన విషయం తెలిసిందే.