వీసా ఇంటర్వ్యూ కోసం ఢిల్లీలోని పాక్ ఎంబసీకి వెళ్లిన ఓ మహిళను అక్కడి అధికారులు వేధింపులకు గురి చేశారన్న వార్త కలకలం రేపుతోంది. పంజాబ్కు చెందిన ఆ మహిళ ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ అధికారులపై ఈ ఆరోపణలు చేశారు. వీసా కోసం వెళ్తే.. అక్కడి సిబ్బంది తనతో అసభ్యంగా ప్రవర్తించారని.. అంతేగాక, భారత్కు వ్యతిరేకంగా పనిచేయాలని తనకు డబ్బు ఆశ చూపారని పేర్కొన్నారు. దీనిపై పాక్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్కు లేఖ రాశారు.
పంజాబ్లోని ఓ యూనివర్శిటీలో సీనియర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఓ మహిళ.. 2021లో పాకిస్థాన్లోని ఓ కాలేజీలో లెక్చర్ ఇవ్వడానికి వెళ్లేందుకు వీసా కోసం ప్రయత్నించారు. ఇందుకోసం దిల్లీలోని పాక్ హైకమిషన్లో వీసా ఇంటర్వ్యూ కోసం ఆన్లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేశారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ కోసం అక్కడకు వెళ్తే సిబ్బంది తనను అసభ్యకర ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారని ఆ మహిళ ఆరోపించారు. ఇంటర్వ్యూలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలని, అందుకు తగినంత డబ్బులు ఇస్తామంటూ ఆశజూపారని ఆ మహిళ పేర్కొన్నారు. కోరిక తీరిస్తే 24 గంటల్లోనే వీసా ఇస్తామని చెప్పారని తెలిపారు.
తాను బయటకు వెళ్లిపోతుండగా ఓ అధికారి వచ్చి సాయం పేరుతో అసభ్యంగా ప్రవర్తించారని వాపోయారు. ‘మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? ఒంటరిగా ఎలా ఉండగలుగుతున్నారు? మీ మతంలో వివాహేతర సంబంధాలు ఉండవచ్చా’ అంటూ ద్వంద్వార్థాలతో ప్రశ్నించారని తెలిపారు. దీనిపై పాకిస్థాన్ పోర్టల్లో ఫిర్యాదు చేశానని, పాక్ విదేశాంగ మంత్రికి లేఖ కూడా రాశానని చెప్పారు. ఇందుకు తాను అంగీకరించకపోవడంతో వీసా మంజూరు చేసేందుకు నిరాకరించారని తెలిపారు.