ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానంలో టెక్నికల్ సమస్య తలెత్తడంతో పాకిస్థాన్లోని కరాచీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. సాంకేతిక లోపాన్ని ముందే గుర్తించి అప్రమత్తమైన పైలట్.. విమానాన్ని సమీపంలోని కరాచీకి మళ్లించినట్లు ఎయిర్లైన్స్ ఓ ప్రకనటలో తెలిపింది. ప్రయాణికుల్ని హైదరాబాద్ రప్పించేందుకు మరో విమానాన్ని పంపుతున్నట్లు పేర్కొంది. భారత ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఆకస్మికంగా కరాచీలో ల్యాండ్ అవడం.. 2 వారాల వ్యవధిలో రెండో ఘటన కావడం గమనార్హం.
దిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్ జెట్ విమానాన్ని కూడా జులై 5న హడావుడిగా పాక్లోని కరాచీకి మళ్లించాల్సి వచ్చింది. అప్పుడు ఫ్యూయల్ ఇండికేటర్ సరిగా పనిచేయలేదు. ఆ ఎస్జీ-11 విమానంలో మొత్తం 150 మంది ప్రయాణికులు ఉన్నారు. స్పైస్ జెట్ విమానంలోని ప్రయాణికులు కరాచీ నుంచి దుబాయి వెళ్లేందుకు వీలుగా మరో ఫ్లైట్ ను భారత్ నుంచి పంపారు. అప్పటివరకు ప్రయాణికులు ఎవరూ ఇబ్బంది పడకుండా వారికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తునకు ఆదేశించింది.