ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో శుక్రవారం (ఈరోజు) ఇంటర్ పరీక్షలు ప్రారంభమైయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారని సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. 1,443 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, పరీక్షలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలను తీసుకున్నామని ఆమె అన్నారు. కరోనా కారణంగా 70శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు ఇవ్వడం జరిగిందన్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేశామని, విద్యార్థులు ఎవరైనా మానసిక ఒత్తిడికి గురైతే, టోల్ ఫ్రీ నెంబర్ 18005999333కి ఫోన్ చేయాలని ఆమె సూచించారు.
మరోపక్క ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియెట్ పరీక్షలకు మొత్తం 10,01,058 మంది విద్యార్థులు హాజరు కానున్నారని విద్యాశాఖ అధికారులు తెలిపారు.పరీక్షల కోసం 1,456 కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమై 12 గంటలకు ముగుస్తుందని అధికారులు పేర్కొన్నారు. నిమిషం ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్షకు అనుమతించబోమని హెచ్చరించారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించమని, జిల్లాకు ఐదు చొప్పున ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లతోపాటు, అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు.