తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు ఓ కీలక విషయాన్ని తెలియజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను ఇదివరకే ప్రకటించింది. ఈరోజు నుంచి పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను వెబ్సైట్లో ఉంచామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ” ఇంటర్ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. హాల్ టికెట్ల విషయంలో కళాశాల యాజమాన్యాలు ఇబ్బందిపెడితే, విద్యార్ధులు నేరుగా వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకొని, పరీక్ష రాయవచ్చు. ఈరోజు సాయంత్రం నుంచి వెబ్సైట్లో హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయి.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వారికోసం 1,449 పరీక్షా కేంద్రాలు, 25 వేలమంది ఇన్విజిలేటర్లను సిద్ధం చేశాం. ఫీజు చెల్లిస్తేనే హాల్టికెట్లు ఇస్తామని ప్రైవేటు కళాశాలల వారు కొందరు విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకే ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు హాల్టికెట్ కోసం కళాశాలకు వెళ్లాల్సిన పనిలేకుండా అంతర్జాలంలో అందుబాటులో ఉంచాం” అని ఆయన అన్నారు.