వైసీపీ కీలక నేత, ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిని ముఖ్యమంత్రి జగన్ విశాఖ నగర పార్టీ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో వైవీ సుబ్బారెడ్డిని నియమించారు. విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల పార్టీ సమన్వయ బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. విశాఖలో అక్రమాలు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపించడం, సొంత పార్టీ నేతల అసంతృప్తి నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి విజయసాయి విశాఖ నుంచి కాకుండా తాడేపల్లి నుంచి పనిచేస్తారు. ఇదికాక, మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు 62 నియోజకవర్గాల పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఇందులో కూడా విజయసాయికి ఏ మాత్రం ప్రాధాన్యం దక్కలేదు. కాగా, ఇదివరకే పార్టీకి సంబంధించిన అన్ని అనుబంధ విభాగాల బాధ్యతలను జగన్ విజయసాయికి అప్పగించారు. ఇదిలా ఉండగా, పార్టీ సమన్వయకర్తలను, జిల్లా అధ్యక్షులను సమన్వయం చేసే బాధ్యతను జగన్ సజ్జలకు అప్పగించారు.