బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి సిరీస్ కోసం భారత్- ఆస్ట్రేలియా జట్లు సిద్ధమవుతున్నాయి. రెండు జట్ల మధ్య 4 టెస్టుల సిరీస్ ఈనెల 9వ తేదీ నుంచి నాగపూర్ వేదికగా ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ అవకాశాలు రెండు జట్లకు ఈ సిరీస్ విజయంపై ఆధారపడి ఉండడంతో ఆసక్తి నెలకొంది. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం ఆసీస్ అగ్రస్థానంలో ఉండగా, టీమిండియా రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఇక సిరీస్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు కఠోర సాధన చేస్తున్నారు. భారత్ స్పిన్ ఎదుర్కొనేందుకు కంగారులు అస్త్రాలను సిద్ధం చేస్తున్నారు.
అశ్విన్ లాంటి స్పిన్ బౌలింగ్ వేసే ఓ బౌలర్ తో ప్రాక్టీస్ చేస్తున్నారు. అశ్విన్ తరహాలో బంతులు విసిరే బరోడా స్పిన్నర్ను నెట్స్లో ఎదుర్కొంటున్నారు. అయితే తొలి టెస్టుకు ముందే ఆసీస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఆటగాళ్లను గాయాలు వెంటాడుతున్నాయి.
ఇప్పటికే మొదటి టెస్టుకు ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ దూరం కాగా, ఇప్పుడు మరో పేసర్ జోష్ హేజిల్ వుడ్ పరిస్థితి కూడా అనుమానంగా ఉంది. హేజిల్ వుడ్ ఎడమ కాలి గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో నాగ్ పూర్ టెస్టులో ఆడడంపై క్లారిటీ రాలేదు. ప్రాక్టీసు సెషన్లలోనూ హేజిల్ వుడ్ కనిపించకపోవడంతో మొదటి టెస్ట్ కూ దూరమయ్యినట్లు తెలుస్తోంది. ఆసీస్ మేనేజ్ మెంట్ కూడా హేజిల్ వుడ్కు విశ్రాంతినివ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఆ జట్టు ఆల్ రౌండర్ ర్ కామెరాన్ గ్రీన్ నాగ్పూర్ టెస్టుకు దూరం కానున్నాడని వార్తలు వస్తున్నాయి. సౌతాఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో గ్రీన్ చేతి వేలికి ఫ్రాక్చర్ అయ్యింది. దాని నుంచి ఇంకా కోలుకోకపోవడంతో న్ తొలి టెస్టులో ఆడే దానిపై సందిగ్థత నెలకొంది.