అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభావం తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు. అన్ని జిల్లాల్లో సమీక్షలు నిర్వహిస్తూ కేడర్ను ఉత్తేజపరుస్తున్నారు. ఇందులో భాగంగా కడప జిల్లాలోనూ ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తుల విభేదాలు ఘర్షణకు దారి తీసింది. ఏకంగా అధినేత చూస్తుండగానే.. బాహా బాహీకి దిగారు. ఈ ఘటన పార్టీలో తీవ్ర కలకలం రేపింది. చంద్రబాబు వద్దని వారిస్తున్నా నేతలు వినిపించుకోకపోవడం గమనార్హం.
కమలాపురం, ప్రొద్దుటూరు ,కడప, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. దీంట్లో కొండా సుబ్బయ్యఅనే పార్టీ నాయకుడు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశాడు. వెంటనే అక్కడే ఉన్న ఆయన అనుచరులు సుబ్బయ్యను వారించే ప్రయత్నం చేశారు. ఇద్దరు కార్యకర్తలు అధినేత సమక్షంలోనే దాడి చేసుకున్నారు. బిగ్గరగా అరుస్తూ పిడిగుద్దులు కురిపించుకున్నారు. మిగిలిన నేతలు కల్పించుకొని విడిపించడంతో గొడవ సద్దుమణిగింది. ఈ ఘటనతో చంద్రబాబు నిర్ఘాంత పోయారు. పార్టీ శ్రేణుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఎవరూ విభేదాలు పెట్టుకోకుండా సమన్వయంతో ముందుకు సాగాలని నేతలకు బాబు సూచించారు.