ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్.. మీడియాపై ఫైర్ అయ్యారు. మే25 న తాను ఇచ్చిన బర్త్డే పార్టీ వల్లే సెలబ్రిటీలకు కరోనా వచ్చిందని కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఆయన ఇచ్చిన పార్టీని ‘కరోనా సూపర్ స్ప్రెడర్’గా కూడా అభివర్ణించాయి. వీటిపై స్పందించిన ఆయన.. ‘‘నేను ఇచ్చిన బర్త్డే పార్టీ వల్ల కరోనా స్ప్రెడ్ అయిందని వచ్చిన వార్తలు అవాస్తవం.
వైరస్ ఎవరి నుంచి ఎవరికి ఎలా వచ్చిందో? ఎప్పుడు వచ్చిందో? ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆ వారంలోనే ఇండస్ట్రీలో ఎన్నో ఫంక్షన్లు, సినిమా షూటింగులు, పెళ్లిళ్లు జరిగాయి. అలాంటప్పుడు నన్నే ఎందుకు నిందిస్తున్నారు? ప్రతిసారీ నన్నే ఎందుకు తక్కువ చేసి చూస్తున్నారు? ఈ మహమ్మారిని నేను సృష్టించలేదు, దాన్ని నేను వ్యాప్తి చేయలేదు. నాకు దానితో ఎలాంటి సంబంధంలేదు. అలాంటప్పుడు నన్నెందుకు శిక్షిస్తూ వార్తలు రాస్తున్నారు’’ అని ప్రశ్నించారు.