ఇప్పటి వరకూ మనం తమ ప్రేమను కాదన్నారనో, బ్రేకప్ అయ్యిందనో లేదా పెళ్లికి నిరాకరించారనో ఇంకా మోసం చేశారనో అనే కారణాలతో ఆత్మహత్య చేసుకున్న ప్రేమికుల గురించి వార్తల్లో విన్నాం, చూశాం . కానీ ఇప్పుడు చదవబోయే స్టోరీ మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. ప్రేమకథల్లో ఉండాల్సిన ట్విస్టులతో పాటు..ఇందులో మరో ఊహించని ట్విస్ట్ ఉంది. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో ఓ విచిత్ర ప్రేమ కథ వెలుగు చూసింది. ఆ ప్రేమకథ ప్రియుడి సూసైడ్తో విషాదాంతమైంది.
తాను ప్రేయసి కోసం ఇప్పటి వరకు చేసిన ఖర్చులను లెక్కరాసి.. ఆ మొత్తాన్ని వసూలు చేయాలంటూ చేతన్ (31) అనే ప్రేమికుడు సూసైడ్ లెటర్ రాసి మరణించాడు . పోలీసుల కథనం మేరకు.. చిక్కమగళూరు జిల్లా శంకరపురకు చెందిన చేతన్ తొమ్మిదేళ్లుగా ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరూ కలసి సినిమాలు, షికార్లు చేసేవారు. ఆ సమయంలో ప్రియురాలు కోరే ప్రతి కోరికను తన బాధ్యతగా తీర్చేవాడు. ఆమె సరాదాల కోసం బాగా ఖర్చు చేయాల్సి వస్తోందంటూ తన స్నేహితుల ముందు చెప్పుకుని ఒక్కోసారి బావురమనేవాడు. డ్రైవర్గా తాను పనిచేసి వచ్చే జీతంతో అధిక భాగం ఆమె కోసమే ఖర్చు చేసేవాడట. ఇక ప్రేమ వ్యవహారాన్ని పక్కన పెట్టి పెళ్లితో ఒక్కటవుదామని ఆమెకు చెప్పగా.. ముఖం చాటేసింది.
ఆమె ప్రవర్తనతో విసిగిపోయి.. చివరకు జీవితంపై విరక్తి చెంది సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్నేహితులు పోలీసులకు తెలిపారు. అతని మృతదేహంవద్ద లేఖ ఒకటి లభించింది. అందులో తాను ప్రేయసి సరదాల కోసం రూ.4.50 లక్షలు ఖర్చు చేశానని పేర్కొన్నారు. ఆ మొత్తాన్ని ఆమె నుంచి వసూలు చేసి తన కుటుంబానికి అందించాలని పోలీసులను కోరారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.