శ్రీనగర్లో మళ్లీ ఆంక్షలు.. భద్రత కట్టుదిట్టం
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలతో కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో మళ్లీ ఆంక్షలు విధించారు. శనివారం ఆంక్షలు సడలించిన తర్వాత కశ్మీర్ లోయలోని పలు ప్రాంతాల్లో కశ్మీర్ యువతకు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నందు వల్ల శ్రీనగర్లో మళ్లీ ఆంక్షలను విధించినట్లు అధికారులు తెలిపారు. సుమారు 12 ప్రాంతాల్లో ఆందోళనకారుల నిరసనలు చేపట్టడంతో పలువులు నిరసనకారులకు గాయాలైనట్లు వెల్లడించారు.
35 పోలీస్ స్టేషన్ల పరిధిలో శనివారం ఆంక్షలు ఎత్తివేసిన అనంతరం రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని, అనంతరం ఆంక్షలు తిరిగి విధించినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి చెప్పారు. మొదటి విడత హజ్ యాత్ర చేపట్టిన మూడు వందల మంది యాత్రికులు శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ వారు స్వస్థలాలకు చేరుకునే ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.