తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రారంభిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం వనపర్తి జిల్లాలో మంగళవారం మన ఊరు-మన బడి కార్యక్రమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మన ఊరు – మన బడి పైలాన్ను సీఎం కేసీఆర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కలిసి ఆవిష్కరించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ..”ప్రభుత్వ విద్యా రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం. మేమంతా సర్కారీ బడుల్లో చదివి పైకి వచ్చిన వాళ్లమే. త్వరలోనే ఇంగ్లీష్ మీడియం కూడా ప్రారంభం అవుతుంది. విద్యార్థులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి” అని సీఎం కేసీఆర్ అన్నారు.
మరోపక్క మహిళల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పాటుపడుతుందని, సమాజ అభివృద్ధిలో వారి పాత్ర మరువలేనిదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మహిళల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని, వారికి జరుగుతున్న అన్యాయంపై పోరాడాలన్నారు. గల్లీల్లోనూ గంజాయి, మందుసీసాలు దొరుకుతున్నాయని.. తెలంగాణను వ్యసనపరుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధానికి అందరూ కదిలిరావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు .