ఇస్రో తాజాగా ప్రయోగించిన పీఎస్ఎల్వీసీ-54 రాకెట్ ప్రయోగ విజయంపై సీఎం కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. శాటిలైట్స్ను పంపిన ‘ధృవ’ స్పేస్టెక్ సంస్థను అభినందించారు. ప్రైవేట్ సంస్థలు శాటిలైట్స్ పంపడం గొప్ప చరిత్రగా వర్ణించారు. తెలంగాణ అంకురం మొదటి సంస్థగా చరిత్ర లిఖించిందని కేసీఆర్ చెప్పారు.
కొన్ని రోజుల కిందట టీ హబ్ లో భాగమైన స్కైరూట్ ఏరోస్పేస్ స్టార్టప్ కంపెనీ రూపొందించిన విక్రమ్-ఎస్ రాకెట్ కూడా విజయవంతంగా రోదసిలోకి దూసుకెళ్లింది. స్కైరూట్ ఏరోస్పేస్, ధృవ స్పేస్ టెక్ స్టార్టప్లు రెండు హైదరాబాదుకు చెందినవి కావడంతో కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. స్కైరూట్ ఏరోస్పేస్, ధృవ స్పేస్ టెక్ సంస్థలకు ఆయన అభినందనలు తెలిపారు. అంతేకాదు, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో యువత నుంచి మెరుగైన ప్రతిభను వెలికితీస్తున్నారంటూ మంత్రి కేటీఆర్ ను అభినందించారు.
దేశంలో ప్రైవేటు రంగంలో రాకెట్ ను పంపించిన తొలి స్టార్టప్ గా స్కైరూట్ చరిత్రలో నిలిచిపోతుందని, ధృవ సంస్థ పంపిన ఉపగ్రహాలు వాటికి నిర్దేశించిన కక్ష్యల్లోకి విజయవంతంగా చేరడం భారత స్టార్టప్ ల చరిత్రలో శుభదినం అని కేసీఆర్ అన్నారు. ఈ ప్రయోగాలు విజయవంతం కావడంతో స్టార్టప్ల నగరంగా హైదరాబాద్ విశిష్టత మరింత పెరిగిందన్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్తులో టీహబ్ స్టార్టప్ లు మరిన్ని ఘనతలు సాధిస్తాయన్న నమ్మకం తనకుందని స్పష్టం చేశారు. దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసే యువతకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఉద్ఘాటించారు.